వామ్మో ఇదేంట్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్లో దర్శనమిచ్చిన పాము!.. తర్వాత ఏం జరిగిందంటే!
మహబూబ్నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తను తింటున్న కర్రీపఫ్లో పాము కనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మధ్య కాలంలో బయట తిండి తినాలంటే గుండె దడ పుడుతోంది. తినే తిండిలో బల్లులు, ఎలుకలు, ఏకంగా పాములు కూడా దర్శన మిచ్చి షాక్ చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు కనీస శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో.. ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్, చౌబేపూర్లో పరోటాలో బల్లి బయటపడింది. మరో ఘటనలో పనీర్ కర్రీలో మాంసం ముక్కలు వెలుగు చూశాయి. ఈ రెండు ఘటనలు మరువక ముందే మరో సంఘటన వెలుగు చూసింది.
ఈసారి మహిళ తింటున్న కర్రీ పఫ్లో ఏకంగా పాము బయటపడింది. ఈ సంఘటన తెలంగాణలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్లలోని జౌఖీనగర్కు చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తూ ఉంది. మార్గం మధ్యలో ఓ బేకరీ దగ్గర ఎగ్పఫ్, కర్రీపఫ్ కొనుగోలు చేసింది. ఎగ్పఫ్ను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు. కర్రీ పఫ్ను శ్రీశైల ఇంటికి పార్శిల్ తీసుకువచ్చింది.
ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కర్రీ పఫ్ తింటూ ఉండగా అందులో చచ్చిన పాము పిల్ల బయటపడింది. దాన్ని చూసి ఆమె షాక్ అయింది. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ బేకరీ దగ్గరకు వెళ్లి విచారణ చేశారు. అనంతరం ఈ విషయంపై ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అభిప్రాయం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక, కర్రీ పఫ్లో పాము వెలుగు చూసిన ఘటన తాలుకా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.