రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో ఇంటర్ బోర్డు పలు మార్పులు తీసుకురానుంది. ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూప్లతో పాటు భాషా సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులకు ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్ పేరిట ఇంటర్నల్ మార్కులకు కేటాయించాలని..
ఒక వేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే సైన్స్ గ్రూప్ విద్యార్ధులతోపాటు ఆర్ట్స్ గ్రూపుల విద్యార్దులకు కూడా 20 మార్కులకు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వనున్నారు. మరోవైపు 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్కు 20 మార్కులు కేటాయిస్తున్నారు. ఆ తరువాత విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
అదే తరహాలో అన్ని లాంగ్వేజ్ సబ్జెక్టుల్లోనూ అమలు చేయాలని తాజా ఇంటర్ బోర్డు ప్రతిపాదనల్లో పేర్కొంది. దీనికి సర్కార్ అనుమతిస్తే ఇక ఇంటర్మీడియట్ హెచ్ఈసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో సబ్జెక్టుకి 20 ఇంటర్నల్ మార్కులు చొప్పున బోర్డు ఇవ్వనుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్లో మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షల విధానంలోనూ మార్పులు చేసి ఇంటర్నల్ మార్కులు చేర్చాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. పాఠ్య ప్రణాళిక రివిజన్ కమిటీల్లోని నిపుణుల సిఫారసు మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ ఏడాది నుంచే ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.