సూర్యాపేట జిల్లాలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రామాపురం గ్రామంలోని ఓ షెడ్డులో కొందరు వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేళ్లచెర్వు మండలంలోని ఓ వైన్స్ దుకాణంలో గతంలో గుమస్తాగా పనిచేసిన రామాపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శివశంకర్ తన స్నేహితులైన రామాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గికి చెందిన శ్రీరాం మహేశ్తో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని తయారుచేసేందుకు ఈ ముఠా సన్నద్ధమైంది.
రామాపురంలోని ఓ షెడ్డులో మద్యం తయారుచేస్తున్నారని స్థానికుల ద్వారా అందిన సమాచారం మేరకు.. హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నకిలీ మద్యం తయారు చేస్తున్న షెడ్డుపై దాడి చేసి రూ.20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యాన్ని ఖాళీ సీసాల్లో నింపి మూతలు బిగించి నకిలీ లేబుల్స్ అతికించి విక్రయించే యత్నం చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతి ఖాళీ విస్కీ సీసాలో 1/4 శాతం స్పిరిట్, 3/4 శాతం నీరు, ఇతరాలు కలిపి విస్కీలా తయారు చేస్తున్నారని, హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి స్పిరిట్ను కొనుగోలు చేసి నకిలీ మద్యం తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సూర్యప్రకాశ్, శ్రీరాం మహేశ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయగా, శివశంకర్ పరారీలో ఉన్నాడు.