జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో జరిపే చర్చల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని.. అలా జరగాలని తాము కోరుకోవడం లేదని భారత్ కుండ బద్దలు కొట్టింది.
జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో జరిపే చర్చల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని.. అలా జరగాలని తాము కోరుకోవడం లేదని భారత్ కుండ బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్కు జమ్మూ కశ్మీర్ అంశంపై ఫోన్ ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఆయన వివరించారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత తెరపైకి పాకిస్థాన్ తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా ట్రంప్కు ప్రధాని మోదీ గుర్తు చేసినట్లు వివరించారు. మంగళవారం రాత్రి ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ల్లో మాట్లాడారని చెప్పారు. ఆ క్రమంలో అపరేషన్ సిందూర్పై ట్రంప్ వివరాలు అడిగినప్పుడు.. అందుకు సంబంధించిన అంశాలను ఆయనకు ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారని పేర్కొన్నారు.
ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్కు మోదీ స్పష్టం చేశారన్నారు. తద్వారా భారత్, పాకిస్థాన్ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపి.. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని తానే నిలువరించానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ప్రధాని మోదీ బలమైన సమాధానం ఇచ్చినట్లు అయిందని విక్రమ్ మిస్రీ వివరించారు.
అపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోదీ తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్థాన్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి.. ఆ ప్రాంతాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని ఆయన స్పష్టం చేసిన విషయం విదితమే.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. అదే తరహాలో పాకిస్థాన్ సైతం భారత్కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ సైన్యం దాడులు నిర్వహించి.. ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. అనంతరం పాక్ సైతం భారత్ భూభాగంలోని క్షిపణులు, డ్రోనులతో దాడులకు దిగింది. వీటిని భారత్ అడ్డుకున్న సంగతి తెలిసిందే.