ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి - గల్లంతైనవారి పరిస్థితిపై కాసేపట్లో వెలువడనున్న అధికారిక సమాచారం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధికారులు పలు విధాలా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది అనుకుంటున్నారు.
మరోవైపు, ఆ మెత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు, కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. మెత్తని భాగాలు ఉన్న చోట తవ్వకాలు అధికారులు జరపనున్నారు. తవ్విన తరువాత మానవ దేహాలా కాదా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ ఘటనలో గల్లంతైన వారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైనా సమాచారం ఉంటే మేము వెల్లడిస్తాం : ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవన్న నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఏదైనా సమాచారం ఉంటే తాము వెల్లడిస్తామని అన్నారు.
Tags
Hyderabad