యాదాద్రి: బీఆర్ఎస్ నాయకులకు దోచుకోవడం తప్పా.. మూసీ అభివృద్ధి పట్టదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు చూసేది ట్రైలర్ మాత్రమే.... జనవరిలో అసలు సినిమా ఉంటుందని మాజీ మంత్రులు హారీష్రావు, కేటీఆర్లకు వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాల క్రితం మూసీ నదిలో రూపాయి బిళ్ల వేస్తే కనిపించేదని ఇక్కడి ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం మూసీ చాలా కాలుష్యంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
మూసీ నదికి ఓ ప్రత్యేకత ఉందని.. రాష్ట్రంలోనే పుట్టి నల్గొండ జిల్లాలో త్రివేణి సంగమంలో కలిసిందని తెలిపారు. దేవుడు తమకు శాపం పెట్టాడా అని.... తమ జీవితాలు మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గీత కార్మికులు గీసే కళ్లు కూడా కలుషితమైందని చెప్పారు. చేపలు, ఇక్కడ పెంచిన గొర్రెలు కూడా తింటే అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. మూసీ నీళ్లతో పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు వ్యవసాయం బంద్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా..
‘‘మూసీ కాలుష్యం... క్యాన్సర్గా మారి గర్భిణీలు బిడ్డలకు జన్మనిచ్చే స్థితిలో లేరు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్లు తమతో కలిసి వచ్చారు. మూసీ హైదరాబాద్లో అనుబాంబు ఆటంబాంబులా మారే అవకాశం ఉంది. లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టి దోచుకోవడానికి నేను రాలేదు.... మీలాగా నేను దరిద్రుడిని కాదు. గంగానదిని ప్రక్షాళన చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే నాకు జన్మనే లేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవరెవరు అడ్డుపడుతారో పేర్లు ఇవ్వండి....నల్గొండ జిల్లా ప్రజలతో బుల్డోజర్ తొక్కించక పోతే నా పేరే మార్చుకుంటా. నల్గొండ జిల్లా ప్రజలతో బుల్డోజర్ తొక్కించక పోతే నా పేరే మార్చుకుంటా. బిల్లా, రంగాలు అడ్డుపడితే బుల్డోజర్తో మా మంత్రి కోమటిరెడ్డి ఎక్కించి తొక్కిస్తారు. ఎవరి దయా దక్షిణాలతో నేను సీఎం కుర్చీలో కూర్చోలేదు’’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు