ప్రతీ నేరం వెనుక గంజాయి ,డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధాన కారణం గంజాయి. డ్రగ్స్.అందుకే రెండు ప్రభుత్వాలు గంజాయి , డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాయి. అయితే కొందరు గంజాయి పెంపకం, రవాణా విషయంలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.
కాలేజీ బాటలో ఎంజాయ్మెంట్ మిషతో ఎంతో మంది యువత గంజాయికి బానిసలవుతున్నారు. బడి బాటలో గంజాయి గుప్పుమంటోంది. పల్లె..పట్నం అనే తేడా లేకుండా డ్రగ్ కల్చర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మత్తుకు బానిసై బంగారంలాంటి భవిష్యత్ను నాశనం చేసుకోవడమే కాకుండా మైకంలో నేరాలకు పాల్పడుతూ బతుకు నిర్వీర్యం చేసుకుంటున్నారెందరో. తెలంగాణ గట్టు మీద గంజాయి ఘాటు కాదు కదా మాట కూడా విన్పించకూడదన్న రేవంత్ సర్కార్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు, బట్వాడా.. వినియోగంపై పోలీసులు పుల్గా ఫోకస్ పెట్టారు. ఎక్కడిక్కడ నాకాబందీతో కేటుగాళ్లను కట్టడి చేస్తున్నారు. అంతేకాదు నిఘా వర్గాల సమాచారంతో గంజాయి నిర్మూలనకు పూనుకుంటున్నారు.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సాలెగూడ శివారులో గిరిజన రైతులు పండిస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించారు. ఇంద్రవెల్లి ఎస్సై సునీల్ తెలిసిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నైతం జ్యోతిరామ్, నైతం మంతులు తమ చేనులో పత్తి పంట మధ్యలో 50 గంజాయి మొక్కలను పెంచారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందడతో ఎస్సై తన టీమ్తో పొలంలో సోదాలు చేసి.. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.