CM Revanth: ఎండిపోతున్న రిజర్వాయర్లు.. రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. జాగ్రత్త!: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కరువు కానీ, మరేదైనా పెద్ద సమస్య అయినా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
లోటు వర్షపాతం కారణంగా అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గురువారం రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ రైతులు , మహబూబ్ నగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని రైతులను కోరుతున్నానన్నారు సీఎం. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఎలా లాభాలు గడిస్తున్నారో, అలాగే ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు నేస్తం’ ప్రారంభించింది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి దశ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.97 కోట్లు మంజూరు చేసింది. కొత్త సదుపాయం రైతులకు నేరుగా నిపుణులు, శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఒక వేదికను అందిస్తుంది.