ఇటీవల కాలంలో గుండెపోటు ముప్పు పెరిగిపోతోంది. అప్పటి వరకు మామూలుగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. అది హార్ట్ఎటాక్ అని తెలుసుకునేలోపే ప్రాణాలు పోతున్నాయి.
వైద్య, పోలీసు, మునిసిపల్ సిబ్బందికి
వీరిలో 35 వేల ఆశాలు, ఏఎన్ఎంలు
హెచ్ఎంసీ పరిధిలో 20 వేల మంది
శానిటేషన్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు
వాలంటీర్లు, దుకాణాల స్టాఫ్కు కూడా
ప్రారంభించనున్న కేటీఆర్, హరీశ్
15 కోట్లతో 1,262 డీఫిబ్రిలేటర్లు ప్రతి ఆస్పత్రిలో ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్, ఇటీవల కాలంలో గుండెపోటు ముప్పు పెరిగిపోతోంది. అప్పటి వరకు మామూలుగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. అది హార్ట్ఎటాక్ అని తెలుసుకునేలోపే ప్రాణాలు పోతున్నాయి. అలా గుండెపోటుకు గురైన వారికి కార్డియోపల్మనరీ రిసుసిటేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఈ సంగతి చాలామందికి తెలియదు. ఒక సర్వే ప్రకారం 2 శాతం మందికే తెలుసు. అందుకే ప్రభుత్వం సీపీఆర్పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించింది. సీపీఆర్పై వైద్య శాఖతో పాటు పోలీసు, మునిసిపల్ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. వీరితో కమ్యూనిటీ వాలంటీర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల సిబ్బంది, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల ప్రతినిధులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా సీపీఆర్పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ అందేలా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం మేడ్చల్లోని జీవీకే-ఈఎంఆర్ఐలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందరికీ సీపీఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను పంపనున్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు 60 మంది చొప్పున, వారంలో 300 మందికి శిక్షణ ఇస్తారు. మొత్తం 1,240 మంది మెడికల్ ఆఫీసర్లు, 1,300 మంది స్టాఫ్నర్సులు, 8,500 మంది ఏఎన్ఎంలు, 26 వేల మంది ఆశాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 18,500 మంది శానిటేషన్ వర్కర్లు, 950 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రతి ఆస్పత్రిలో డీఫిబ్రిలేటర్
గుండెపోటుకు గురైన సమయంలో సీపీఆర్తో పాటు చికిత్సకు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ను కూడా ఉపయోస్తారు. దీంతోనే గుండె లయను విశ్లేషిస్తారు. అవసరాన్ని బట్టి విద్యుత్ షాక్ ఇస్తారు. ఇది గుండె లయ తిరిగి ప్రారంభమవడానికి దోహదపడుతుంది. ఈ పరికరాలను 636 పీహెచ్సీలతో పాటు, 236 యూపీహెచ్సీలు, 390 బస్తీదవాఖానాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 1,262 పరికరాలను రూ.15 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
పెరుగుతున్న సీఎస్ఏ
కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ నివేదిక ప్రకారం సడన్ కార్డియాక్ అరెస్ట్ (సీఎ్సఏ) అయిన ప్రతి 10 మందిలో ఒక్కరే ప్రాణాలతో బయటపడుతున్నారు. ఒకవేళ వెంటనే సీపీఆర్, డీఫిబ్రిలేటర్ అందించగలిగితే ప్రతి 10 మందిలో ఐదుగురిని రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి 10 కేసుల్లో ఏడుగురు ఇంటి దగ్గర ఉన్నప్పుడే గుండెపోటుకు గురవుతున్నారని ఆ నివేదిక తెలిపింది. అలాగే దేశంలో 98ు మందికి సీపీఆర్ గురించి అవగాహన లేదని వెల్లడించింది. గుండెపోటుతో మన దేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం గుండెపోటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 5.80 కోట్ల మంది చనిపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సీపీఆర్పై ఎక్కువగా అవగాహన ఉంది. కుటుంబంలో ఎవరైనా గుండెపోటుకు గురైతే కుటుంబ సభ్యులే సీపీఆర్ చేస్తారు. మన దగ్గర మాత్రం సీపీఆర్ గురించి అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సీపీఆర్ అంటే ఏమిటో కనీస అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
Tags
News@jcl.