జడ్చర్ల మండలం నసర్లాబాదు గ్రామంలో ఘటన
రైతుల ఆవేదన – ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం.
పాలమూరు జిల్లా జడ్చర్ల మండలంలోని నసర్లాబాదు గ్రామంలో చెక్డాం కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం రైతుల కోసం, భూగర్భ జలాలు పెంచేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్డాంలు, కొందరి ఆక్రమణలకు గురవుతున్నాయి.
గ్రామంలోని 607/2 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న చెక్డాం వద్దకు వచ్చే కాలువను కొందరు వ్యక్తులు పూడ్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చెక్డాం ప్రాంతాన్నే తమ పొలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
రాజకీయ నాయకుల అండదండలతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని, తమకు ఎవరూ అడ్డుకాదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తే, పైస్థాయి రాజకీయ ఒత్తిడుల కారణంగా నోటీసులు ఇవ్వడానికే భయపడుతున్న పరిస్థితి ఉందని సమాచారం. రైతుల జీవనాధారమైన నీటి వనరులు కబ్జాకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
చెక్డాంలు గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వనరులు ఆక్రమణలకు గురైతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి, చెక్డాంను రక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.