మద్యం మత్తులో ఉన్నాడా.. మదమెక్కి ప్రవర్తించాడా తెలియదు కాని.. హైదరాబాద్ గచ్చిబౌలిలో బెంజ్ కారుతో ఓ వ్యక్తి చేసిన వీరంగం చూసేవాళ్లను భయాందోళనకు గురిచేసింది. తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. వేరే కార్లను ఢీకొట్టి బీభత్సం సృష్టించడంతో.. అడ్డుకోడానికి వెళ్లిన కానిస్టేబుల్ ను బ్యానెట్ పై కొంత దూరం తీసుకెళ్లి చుక్కులు చూపించడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం (మార్చి 01) ఉదయం జరిగిన ఈ ఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 10:30 గంటలకు నానక్రామ్గూడ దగ్గర రాహుల్ కమరాజు అనే వ్యక్తి కారును అతివేగంగా వెనుక నుండి బెంజ్ కారు ఢీకొట్టింది. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు కారును ఆపబోయాడు. కారును ఆపమని చెప్పినా ఆపకుండా నార్సింగికి చెందిన గుర్రం పాటి తరుణ్ (24) బెంజ్ కారును డ్రైవ్ చేయడంతో కానిస్టేబుల్ పైకి దుసుకెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు కారు బ్యానెట్ పై పడిపోయాడు నర్సింహులు.
బ్యానెట్పై కానిస్టేబుల్ ఉన్నాడని తెలిసి కూడా నిందితుడు వాహనాన్ని డ్రైవ్ చేస్తూ భయాందోళనకు గురిచేశాడు. జిగ్-జాగ్ రీతిలో నడుపుతూ కారును ముందుకు తీసుకుపోవడం సీసీటీవీలో రికార్డైంది. కారు భయంకరంగా నడుపుతూ కానిస్టేబుల్ ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని చూసిన పలు వాహనదారులు కారుకు అడ్డంగా వాహనాలు పెట్టారు. దీంతో చేసేదేమీ లేక కారును అపాడు నిందితుడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా రక్తంలో 160 mg/100 ml ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హజరు పరిచారు గచ్చిబౌలి పోలీసులు. నిందితునికి 14 రోజుల రిమాండ్ జుడిషియల్ కస్టడీ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు.