హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలవనున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యార్ధుల హాల్ టికెట్లు కూడా విడదలయ్యాయి. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్ నంబరు ద్వారా కూడా హాల్టికెట్లు పొందొచ్చు. విద్యార్ధులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యార్థులకు సూచించారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్ధులు సులువుగా చేరుకునేందుకు హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను కూడా ముద్రించారు. మొబైల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ ఆటోమెటిక్గా ఓపెన్ అవుతుంది. పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతాయి. అందువల్ల విద్యార్ధులు పాఠ్యాంశాలు చదివి వాటిని రాయడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంటాయి. అప్పుడు పరీక్షలో సమాధానాలు చక్కగా గుర్తుపెట్టుకుని రాయడానికి అవకాశం ఉంటుందని పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
Tags
Telagana