రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. ఇంకో పది రోజులు మాత్రమే ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు. నిన్న రాత్రి మున్సిపల్ , కార్పొరేషన్లకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. ముందుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముందుగా అభ్యర్థులను డిసైడ్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. అందుకే ఇప్పటినుంచే ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. కోడ్ అమల్లోకి రాకముందే అధికార పార్టీ సైతం ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
50 శాతం మహిళలకే రిజర్వేషన్
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం సూచన మేరకు ఎన్నికల సంఘం 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ రిజర్వేషన్ల వారీగా మహిళా అభ్యర్థుల కోసం వేటను మొదలెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మూడు పార్టీలు ప్రధానంగా మున్సిపల్ చైర్మన్, చైర్ పర్సన్, మేయర్ స్థానాలపై కన్నెసినట్టు తెలుస్తున్నది. ముందుగా అధికార పార్టీ విషయానికొస్తే ఈసారి పార్టీలో ఆశావహులు భారీగానే పార్టీ పెద్దలు, మంత్రుల వద్ద లాబీయింగ్ మొదలెట్టినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్ల వారీగా జనరల్ స్థానాల్లో కేటాయించిన సీటును తమకే ఇవ్వాలని పురుష అభ్యర్థులు పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కారణంగా ఈసారి పురుషుల అధిక్యానికి గండిపడనుంది.