భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదన్న కోపంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. నేపాల్ నుంచి యువతి తన భర్తతో కలిసి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ జంట స్థానికంగా చైనీస్ ఫుడ్ స్టాల్ నిర్వహించే వారని చెప్పారు.
గుజరాత్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదన్న కోపంలో ఓ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. మోదాసా టౌన్లో శనివారం ఈ దారుణం వెలుగు చూసింది. మీడియా కథనాల ప్రకారం, ఊర్మిళ అనే యువతి తన భర్తతో కలిసి స్థానికంగా చైనీస్ ఫుడ్ బిజినెస్ను నిర్వహిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె భర్తను కొత్త మొబైల్ ఫోన్ను కొనివ్వమని అడిగింది. అయితే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ కొనడం సాధ్యం కాదని అతడు చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు శనివారం క్షణికావేశంలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్యతో స్థానికంగా కలకలం రేగింది. స్వల్ప వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందని తాము ఊహించలేదని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంటల్ డెత్గా కేసు నమోదు చేశారు. నేపాల్కు చెందిన ఆ జంట ఉపాధి నిమిత్తం గుజరాత్కు వచ్చారని పోలీసులు తెలిపారు (Gujarat Woman Ends life Over Buying New Phone).
ఇటీవల మధ్యప్రదేశ్లో కూడా దాదాపు ఇలాంటి ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. శివపురి జిల్లాకు చెందిన ఓ మహిళ అత్తతో నెయ్యి విషయంలో గొడవపడి చివరకు ఆత్మహత్య చేసుకుంది. భర్త బలవంతం మేర ఆమె తొలుత అత్తకు 100 గ్రాముల నెయ్యిని అయిష్టంగానే ఇచ్చింది. ఆ తరువాత భర్త మరోసారి నెయ్యిని తన తల్లికి ఇవ్వడంతో కోపం పట్టలేకపోయిన ఆమె క్షణికావేశంలో విషం తాగింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.