నల్లగొండ, జనవరి 31: జిల్లాలోని నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించింది. నగేష్ భార్య మమత (25)ను వంపు సుజాత అనే మహిళ కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటనలో ఆరు నెలల బాబుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేష్కు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో నగేష్ భార్య మమతను సుజాత నిర్దాక్షిణ్యంగా చంపేసింది. మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక మమత వీధిలోకి పరిగెత్తింది.
చివరకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో మమత చంటి బిడ్డకు కూడా మంటలు అంటుకుని.. తీవ్ర గాయాలయ్యాయి. బాబును వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Tags
Hyderabad