డ్రంక్ అండ్ డ్రైవ్.. 270 మందికి జైలు శిక్ష


 2026 న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 270 మందికి జైలు శిక్ష విధించారు. 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వందలాది మంది పట్టుబడ్డారు.

హైదరాబాద్: 2026 న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవర్‌లో పట్టుబడిన వారిలో 270 మందికి జైలు శిక్ష విధించారు. 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వందలాది మంది పట్టుబడ్డారు. ఈ కేసుల్లో విచారణ చేపట్టిన నగరంలోని పలు న్యాయస్థానాలు మొత్తం 270 మందికి జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువరించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను వారి కార్యాలయాలు, కళాశాలలకు పంపిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు సిఫారసులు చేస్తున్నట్లు వెల్లడించారు.


న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రతకు సహకరించాలని పోలీసులు కోరారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow