Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..


 - యువకుడి మెడకు తీవ్ర గాయం.. 19కుట్లు వేసిన వైద్యులు

సికింద్రాబాద్: నిషేధిత చైనా మాంజా(Chinese manja) మరోసారి వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ ఇంటర్‌ విద్యార్థి మెడకు మాంజా చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధి కీసర డివిజన్‌ కేంద్రంలో శుక్రవారం జరిగింది. కీసరలో నివసించే పిన్నింటి సుధాకర్‌రెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి.. సెలవు రోజు కావటంతో ద్విచక్రవాహనంపై కీసర దాయర రోడ్డులో ఉండే తమ పొలం వద్దకు బయలుదేరాడు. గ్రామ శివారులోకి చేరుకోగానే, చెట్లపై నుంచి తెగి రోడ్డుకు అడ్డంగా వేలాడుతున్న మాంజాను గమనించకుండానే ముందుకు వెళ్లాడు.

దీంతో ఆ దారం యశ్వంత్‌ మెడకు చుట్టుకుని రాపిడికి లోనై కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయం లోతుగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించి, సుమారు 19 కుట్లు వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిషేధం ఉన్నప్పటికీ మాంజా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow