Mla Anirudh Reddy: కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మరో 70 ఏళ్లు అయినా సీఎం కాలేరన్నారు. పవన్ తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్లిపోవాలన్నారు. అందుకే పవన్ ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేస్తే తెలుస్తోందన్నారు. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా రూ.800 పెట్టి తాను సినిమా చూశానని చెప్పుకొచ్చారు.
నేను కూడా పవన్ అభిమానినే
‘తెలంగాణ వాళ్ల నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు ఎడిపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం.. ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్లకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్లు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నింట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా మేము ఒక్క మాట అంటున్నామా? నేను కూడా పవన్ కల్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడారు కాబట్టి తప్పే. పవన్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా పోయి సినిమా చూశాను’- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హైదరాబాద్ లో ఆస్తులెందుకు కొంటున్నారు?
తెలంగాణ వాళ్లది నర దిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నారని పవన్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో ఉండాలని సూచించారు. పవన్ తప్పు మాట్లాడారు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.