రేవల్లి : సాటి వ్యక్తి కష్టాల్లో ఉంటే ఎవ్వరి పనుల్లో వారు నిమగ్నమై పట్టించుకోని నేటి ఆధునిక యుగంలో కష్టాల్లో ఉన్న సాటి మనిషి సాయం చేయాలని చాటి చెప్పారు వనపర్తి జిల్లా ఏదుల గ్రామస్తులు. మానవత్వాన్ని చాటి చెప్పారనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. ఏదుల గ్రామానికి చెందిన ఎర్రమొని వెంకటమ్మ, హన్మంతులు భార్యభర్తలు. వీరిది దినసరికూలి కుటుంబం. ఉన్నకాస్త వ్యవసాయపొలం పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు ముంపునకు గురవ్వగా.. జీవనోపాధి కోసం హైదరాబాద్ కి వలస వెళ్లి అక్కడ దినసరి కూలీ చేసుకుంటూ పొట్ట పోసుకునేవారు. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి వారి కుటుంబం. ఇలాంటి సమయంలోనే ఎర్రముని వెంకటమ్మ (45) అనారోగ్యం పాలై ఆదివారం ఉదయం అకస్మాత్తుగా చనిపోయింది. దహనసంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఈ విషయాన్ని ముదిరాజుల సంఘం సభ్యులకు తెలిపి సహాయాన్ని కోరాగా.. గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో గ్రామస్తులంతా స్పందించి దాదాపు రూ.34 వేలు ఆర్థికసహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Tags
mahabubnagar