ముక్కుపచ్చలారని మూడేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేసిన తల్లి.. తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్కు చెందిన యశోద (36)కు 12 ఏళ్ల క్రితం వివాహమయింది. ఆమెకు ఓ కొడుకు, మూడేళ్ల కూతురు అక్షర ఉన్నారు. తన భర్త నరేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంటి ముందు జీడిపప్పు ఆరబెట్టగా ఓ కుక్క ఎంగిలి చేసింది. కుటుంబ సభ్యులు ఏం కాదులే అనుకుని ఆ జీడిపప్పును వంటకు వాడేశారు. కొద్దిరోజులుగా యశోద ఒంటిపై అలర్జీ ప్రారంభమైంది. తన అలర్జీకి కుక్క ఎంగిలి చేసిన జీడిపప్పే కారణమని రేబిస్ ఇంజక్షన్ కూడా తీసుకున్నది. అయినా అలర్జీ తగ్గకపోవడం, తన మానసిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో సోమవారం భర్త బయటకు వెళ్లిన తరువాత కూతురు అక్షరను గొంతు నులిమి చంపేసింది. తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ బోర్డు, డోర్లపై తన భర్త, కొడుకు బాగుండాలని, వాళ్ళు మంచిగా వైద్యం చేయించుకోవాలని రాసింది.
