హైదరాబాద్, ఆగస్ట్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ తాజాగా వెల్లడించింది. అయితే పదో తరగతి పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించాలని, 80 శాతం ఎక్స్టర్నల్ మార్కులకు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.నిజానికి, పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం వంద మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. దీంతో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాదికి అసలు ఇంటర్నల్ మార్కులు ఉంటాయా? లేదా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు క్లారిటీ లభించింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్వహించిన వర్క్షాప్లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.
Tags
Telagana