సూర్యాపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వచ్చే నెల ఆగస్టు 3న జిల్లాలో పద్మశాలి కులసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ అనే వ్యక్తుల మధ్య పోటీ జరుగనుంది.
ఎన్నికల నేపధ్యంలోనే గత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్కు వ్యతిరేకంగా శ్రీరాముల రాములు వాట్సాప్లో పోస్టులు పెట్టారు. అయితే, అప్పం శ్రీనివాస్కు మద్దతుగా మానుపూరి కృపాకర్ అనే వ్యక్తి ఎమోజీతో ఆ పోస్టుకు రిప్లై ఇచ్చారు. దీంతో మానుపూరి కృపాకర్పై శ్రీరాముల రాములు వర్గం దాడి చేసింది. ఈ దాడిలో మానుపూరి కృపాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మానుపూరి కృపాకర్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు వర్గాల మధ్య ఏలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు హై అలర్ట్ అయ్యారు.