హెడ్కానిస్టేబుల్కు ప్రెసిడెంట్ మెడల్..
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్కు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పతకం దక్కింది. మాదాపూర్ సీసీఎస్లో పనిచేస్తున్న యాదయ్య అనే హెడ్ కానిస్టేబుల్ కు ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్, ఐజీలు విజయ్కుమార్, రమేశ్ అభినందించి, శాలువాతో సన్మానించారు.
2022 జులై 25న నిరంజన్ నీలంనల్లి, రాహుల్ అనే ఇద్దరు చైన్స్నాచర్లు మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు రవి, దీబేష్ కేసును చాలేంజ్గా తీసుకుని సీసీ ఫుటేజీలు, బాధితురాలి వాంగ్ములం ప్రకారం విచారణ ప్రారంభించారు.
జులై 26వ తేదీన బొల్లారం ఎక్స్రోడ్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై మారణాయుధాలతో దాడులు చేశారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య చాతిపై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు యత్నించారు. తీవ్రంగా రక్తమోడుతున్నా గాని ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో వైద్య చికిత్సల అనంతరం కోలుకున్నాడు. అనంతరం ఇద్దరు నిందితులను విచారించగా వీరు కర్ణాటకలోని గుల్బార్గ జిల్లా అశోక్నగర్ పోలీసు స్టేషన్పై దాడి, పలుచోట్ల దోపిడి, దొంగతనాలకు పాల్పడిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు
213 మందికి మెడల్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చదువు యాదయ్యతో పాటు 213 మంది సిబ్బందికి మెడల్ ఆఫ్ గ్యాలంటరీ(జీఎం) ప్రదానం చేయనున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి గరిష్ఠంగా 52 శౌర్య పతకాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 17 మంది పోలీసు సిబ్బంది, ఛత్తీస్గఢ్ నుండి 15, మధ్యప్రదేశ్ నుండి 12 మందికి పతకాలు వరించాయి. రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం అత్యున్నతమైనది కావడంతో.. ఈ పతకం వచ్చిన చదువు యాదయ్య పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.