బండి సంజయ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిలో (Telangana culture) బోనాలకు (Bonalu) విశేషమైన ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. గ్రామ దేవతలకు బోనం సమర్పించడమే ఇందులో ప్రధాన ఘట్ఠం. గ్రామ దేవతలకు సమర్పించే నైవేధ్యాన్ని బోనం అంటారు. హైదరాబాద్లో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని (Bhagyalakshmi Ammavaru) దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు. కాగా అంబర్పేట్ మహంకాళీ దేవాలయంలో బోనాల జాతర వైభంగా జరుగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని అన్నారు. సీఎం రేవంత్కు దమ్ముంటే అక్బర్ను కాంగ్రెస్ టికెట్పై కొడంగల్లో పోటీచేయించాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. అక్బర్ కాంగ్రెస్లో చేరితే కొడంగల్ నుంచి గెలిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఆయనకు ధీటుగా బీజేపీ నుంచి కొడంగల్లో కతర్నాక్ అభ్యర్థిని నిలబెడతామని అన్నారు. ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను ఇంచార్జ్గా నియమిస్తామని, కొడంగల్లో అక్బరుద్దీన్కు డిపాజిట్ రాకుండా చూసే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి పండుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆడవారిని గౌరవాయించడమే అమ్మకు ఇచ్చే నైవేద్యమని, ఆడపిల్లను మంచి భావనతో చూడాలని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలని, అమ్మవారు అందరిని అనుగ్రహింస్తుందని దత్తాత్రేయ అన్నారు.
భాగ్యనగరంలో బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కలు సమర్పిస్తున్నారు.
బోనాల కార్యక్రమం సజావుగా సాగేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. 500 కు పైగా పోలీసుల బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంది. బోనాల సందర్భంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు రెండు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పాతబస్తీలోని ప్రధాన 23 ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.