సామాన్య కుటుంబం నుంచి..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్కు చెందిన సందీప్ బాగ ఐఆర్ఎస్ అధికారిగా.. బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్లోని జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. తన రోజువారీ పనిలో ఆయన బిజీగా ఉంటుంటారు. బెంగళూరులోని క్వీన్స్ రోడ్లోని సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్లోని 5వ అంతస్తులో ఆయన తన విధులు నిర్వర్తిస్తారు. సాధారణంగా పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులను ఆయన డీల్ చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసిన వారి వివరాలు సేకరించి.. వారి నుంచి పన్ను మొత్తాన్ని రికవరీ చేయడం ద్వారా భారత ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచగలిగే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
సందీప్ ఐఆర్ఎస్ అధికారిగా నిబద్ధత, అంకితభావంతో సందీప్ తన విధులను నిర్వహిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకు సామాన్య జీవితం గడపాలని, పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలని.. అలాగే వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు.. సామాన్య ప్రజల ఎదుగుదలకు తన వంతు ప్రయత్నం చేయాలన్నదే సందీప్ నిరంతర ఆలోచన. దీనిలో భాగంగా ఐఆర్ఎస్ అధికారి సందీప్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామాన్ని సందర్శించాడు. ఆ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి.. వారితో కలిసి ఒకరోజు పనిచేశాడు. దీనికోసం ఆయన ఎటువంటి వేతనం తీసుకోలేదు.
సామాన్య ప్రజల కష్టాలను, బాధలను తెలుసుకోవడంతో పాటు.. వారితో కలిసి పనిచేసిన అనుభూతిని పొందేందుకు సందీప్ ఉపాధి హామీ పనిచేశారు. అలాగే భోజన విరామ సమయంలో కూలీలతో కలిసి భోజనం చేశారు. పని సమయం అయిపోయిన తర్వాత ప్రభుత్వ పథకాలపై కూలీలకు అవగాహన కల్పించారు. మహిళలకు స్వయం ఉపాధి పథకాల గురించి వివరించారు. అంతేకాకుండా పనికి వచ్చిన 152 మంది కూలీలకు ఒకరోజు వేతనం రూ.200ను సందీప్ తన నెలవారీ జీతం, పొదుపు ఖాతా నుంచి చెల్లించారు. చివరిగా అందరితో కలిసి బతుకమ్మ ఆడారు. ఓ ఐఆర్ఎస్ అధికారి తమ మధ్యలోకి వచ్చి సామాన్య వ్యక్తిలా పనిచేయడం ద్వారా కూలీల్లో ఆత్మగౌరవం, భరోసా పెరగడంతో పాటు స్వయం ఉపాధి దిశగా వారంతా ఆలోచించేందుకు సందీప్ చేసిన కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
