ప్రస్తుతం జనాలు క్యాష్ వాడడం మానేశారు. ఇప్పుడు ఎక్కడ చూసిన యూపీఐ పేమెంట్స్ చేయడం కామన్గా మారింది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికే ఇండియా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. కానీ ఇకపై అలా ఉండదంటూ ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని సంజయ్ మల్హోత్ర తెలిపారు. యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఖర్చులను కేంద్రమే భరిస్తుందన్నారు. పేమెంట్స్, నగదు అనేది ఆర్థికవ్యవస్థకు జీవనాడి లాంటిదని వ్యాఖ్యానించారు. యూపీఐ వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే కస్టమర్లు కొన్ని ఛార్జీలను భరించాలని చెప్పారు. యూపీఐ సేవలు నిరంతరాయంగా అందించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే ఆదాయం ఆశించకుండా ఏ సంస్థ కూడా ముందుకు సాగడం అసాధ్యమని.. కాబట్టి కస్టమర్లు కొన్ని ఛార్జీలు భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుటికిప్పుడు ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండదని.. యూపీఐ సేవలను ఫ్రీగానే అందించాలనే యోచనలోనే కేంద్రం ఉందని స్పష్టం చేశారు.
గత రెండేళ్లలో యూపీఐ లావాదేవీలు రెట్టింపయ్యాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. గతంలో ప్రతిరోజు 30 కోట్ల లావాదేవీలు జరిగితే.. ఇప్పుడు 60 కోట్లకు పైగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్ని లావాదేవీలు జరిగినా బ్యాంకులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి సంస్థలకు పెద్దగా ఆదాయం ఉండదు. ఈ నేపథ్యంలో ఛార్జీలను ప్రవేశపెట్టాలని గతంలోనే బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు కేంద్రానికి రిక్వెస్ట్ చేసినా.. కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.