Congress MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపించారు.
వనపర్తి: మాజీమంత్రి నిరంజన్ రెడ్డిపై (Niranjan Reddy) కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి (Congress MLA Mega Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కృష్ణానది స్థలాన్నిఆయన ఆక్రమించారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) వనపర్తిలోని కాంగ్రెస్ కార్యాలయంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ నది పరివాహక ప్రాంతంలో మట్టిని తోడేస్తూ, దుర్వినియోగం చేస్తూ ఆయన భూ కబ్జాల నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివారులోని సర్వే నంబరు 57లో విలువైన భూమిని నిరంజన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని మండిపడ్డారు. వారు ఆ భూమిని కబ్జా చేసినట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి చెప్పారు.