టాప్‌-10లో ర్యాంకుల్లో 9 మంది వారే 7వ ర్యాంకు చంద్రకాంత్‌.. 5వ ఉద్యోగం!

 




ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2,49,557 మంది జనరల్‌ ర్యాంకుల ప్రకటన


అత్యధిక మార్కులు 339 (75.38ు)తో ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్‌రెడ్డి


ఓఎంఆర్‌ షీట్లు నెల రోజులు ఆన్‌లైన్‌లో.. పారదర్శకంగా ప్రక్రియ: బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగుతోంది. గ్రూప్‌-3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1388 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా 2,67,921 మంది అన్ని (3) పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 18,364 మందిని ఇన్‌వ్యాలీడ్‌గా ప్రకటించారు. మిగతా 2,49,557 మంది జనరల్‌ ర్యాంకింగ్‌ వివరాలను కమిషన్‌ విడుదల చేసింది. అలాగే టాప్‌-10 జనరల్‌ ర్యాంకులు, టాప్‌-10 మహిళా ర్యాంకులను విడుదల చేశారు. టాప్‌-10 జనరల్‌ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది మంది పురుషులుండగా, ఒక్కరే మహిళ ఉన్నారు. మొత్తం 450 మార్కులకుగాను 339.239 (75.38 శాతం) మార్కులు సాధించి కుకునూరి అర్జున్‌రెడ్డి టాపర్‌గా నిలిచారు. గత జనవరిలో ఈ పరీక్ష ప్రిలిమనరీ కీ విడుదల చేయగా.. అందులో అభ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలపై నిపుణుల అభిప్రాయాలు సేకరించామని టీజీపీఎస్సీ తెలిపింది. జనరల్‌ ర్యాంకింగ్స్‌ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని కమిషన్‌ కార్యదర్శి పేర్కొన్నారు. కాగా, గ్రూప్‌-3 పరీక్ష, సమాధాన పత్రాల పరిశీలన, ఫలితాల వెల్లడిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని కమిషన్‌ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థుల మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌తోపాటు ఓఎంఆర్‌ షీట్లను వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచామని, వీటిని ఏప్రిల్‌ 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. వెబ్‌సైట్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కార్యాలయ పనివేళల్లో ఫోన్‌ 040-23542185, 23542187 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

గ్రూప్‌-2లో 18వ ర్యాంకు.. గ్రూప్‌-3లో టాపర్‌


పాపన్నపేట: గ్రూప్‌-3 ఫలితాల్లో 339.239 మార్కులతో టాపర్‌గా నిలిచిన కుకునూరి అర్జున్‌రెడ్డి.. ఇటీవల విడుదలైన గ్రూప్‌-2 ఫలితాల్లోనూ 18వ ర్యాంకు సాధించారు. తండ్రి నరేందర్‌రెడ్డి గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తుండగా.. అర్జున్‌రెడ్డి అదే గ్రంథాలయంలో పరీక్షలకు సన్నద్ధమయ్యారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన అర్జున్‌రెడ్డి పదో తగరతి వరకు మెదక్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, 2013లో బీటెక్‌ పూర్తి చేశారు. 2014లో వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. పదోన్నతి పొందిన ఆయన ప్రసుత్తం మెదక్‌ కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా, చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలని ఉందని, ఆ మేరకే గ్రూప్స్‌ వైపు అడుగులు వేశానని అర్జున్‌రెడ్డి తెలిపారు. సివిల్స్‌లో విజయం సాధించడమే లక్ష్యమన్నారు.



7వ ర్యాంకు చంద్రకాంత్‌.. 5వ ఉద్యోగం!

శంకర్‌పల్లి/సిద్దిపేట కల్చరల్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతుబిడ్డ ఒగ్గు చంద్రకాంత్‌ గ్రూప్‌-3 ఫలితాల్లో 7వర్యాంకు సాధించారు. చంద్రకాంత్‌ ఇప్పటికే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఫలితాలు రెండింట్లోనూ 27వ ర్యాంకు సాధించిన చంద్రకాంత్‌.. జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాల్లో మూడవ ర్యాంకర్‌గా నిలిచారు. తాజాగా గ్రూప్‌-3లో ర్యాంకుతో వరుసగా ఐదో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఇదిలా ఉండగా.. సిద్దిపేటకు చెందిన వడ్లకొండ సచిన్‌ గ్రూప్‌-3 ఫలితాల్లో 317 మార్కులతో 23వ ర్యాంకు సాధించారు. ఇప్పటికే ఆయన గ్రూప్‌-2 ఫలితాల్లో 2వ ర్యాంకుతో సత్తా చాటారు.



మళ్లీ మెరిసిన గిరిజన ఆణిముత్యం


మహేశ్వరం: టీజీపీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షల్లో వరుసగా నాలుగోసారి సత్తా చాటాడు ఓ సామాన్య గిరిజన యువకుడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నల్లచెరువు తండాకు చెందిన దేవేందర్‌నాయక్‌.. గ్రూప్‌-3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించారు. ఇప్పటికే గ్రూప్‌-4లో ఉద్యోగం సాధించి శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల నిర్వహిస్తున్న దేవేందర్‌నాయక్‌ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో 433 మార్కులు సాదించారు. గ్రూప్‌-2 పలితాల్లో 171వ ర్యాంకు పొందారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me