MLA Yennam Srinivas Reddy: బీఆర్ఎస్ పడవ మునిగి పోతోంది. అందుకు కేటీఆర్ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఏదో మాట్లాడుతారు.. మరేదో చెప్తారు.. కేటీఆర్ కు అసలు ఏమి అర్థం కావడం లేదు. ఎందుకంత తాపత్రయం.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. మీ పడవ మునిగిపోవడం ఖాయం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీ పప్పులు ప్రజల ముందు ఉడకవంటూ.. మహబూబ్ నగర్ ఎమ్మేల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహం లక్ష్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్, కేటీఆర్ కామెంట్స్ పై ఎమ్మేల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి గురువారం స్పందించారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకున్నా, ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా రాజకీయ కుతంత్రాలను కేటీఆర్ సాగిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో ప్రజా మద్దతు కూడగట్టుకోవడం ఏ మాత్రం కాదని, ప్రజల మనస్సులు గెలుచుకోవాలని ఎమ్మేల్యే అన్నారు.
అలాగే తెలంగాణ తల్లి అంటే సామాన్యమైన గృహిణిని తల్లిగా భావించి, కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి రూపాన్ని ఏర్పాటు చేస్తే ఓర్వలేక కేటీఆర్ అదేపనిగా ట్రోలింగ్స్ సాగిస్తున్నారన్నారు. తెలంగాణ సమాజంలో భార్యను మార్చే సంస్కృతి లేదని, అది కూడా తెలియని కేటీఆర్.. భార్యను మారుస్తారు కానీ తల్లిని మారుస్తారా అంటూ కామెంట్స్ చేయడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. ఆ సంస్కృతి మీకు ఉందేమో కానీ మా తెలంగాణ సంస్కృతిలో లేదన్నారు. 1969 లో ఉద్యమం ఉధృతంగా సాగే సమయంలోనే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశారని, ఆ చరిత్ర తెలియకుండా తాము కొంచెం మార్పు చేసి తల్లికి రూపం ఇస్తే ట్రోలింగ్స్ సాగించడం తగదన్నారు.
అసలుసిసలైన ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణంగా తమ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గెజిట్ ఇచ్చిన విషయంపై బీఆర్ఎస్ ఓర్వలేక పోతుందని యెన్నం విమర్శించారు. మధ్యలో బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాల కోసం తల్లి రూపాన్ని మార్చారని, తాము మార్చామని చెప్పడం తగదని హెచ్చరించారు. సుమారు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై ట్రోలింగ్స్ సాగిస్తున్నా, అవేమీ తెలంగాణ ప్రజలు హర్షించరని ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ది కలగాలని ఎమ్మేల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు.