హైదరాబాద్: ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ (Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం, ఖైరతాబాద్ అధ్యక్షుడు దేవరశెట్టి వీరేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బెలిదె రాజు గుప్తా, సలహాదారులు కొండ్లె మల్లిఖార్జునగుప్త, కోశాధికారి ప్రకాష్ గుప్తా, ప్రతినిధులు అరుణార్తి మహేష్, గోపిశెట్టి ప్రవీణ్, మల్లికార్జున రమేష్ తదితరులు పాల్గొన్నారు.
శివపార్వతుల కల్యాణం
- హాజరైన ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ భారీ గణపతి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. సంఘం రాష్ట్ర కోశాధికారి కళ్లపల్లి రాచప్ప ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద బ్రాహ్మణులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గణపతికి కుడివైపున శివపార్వతుల కళ్యాణ ఘట్టంతో కూడిన విగ్రహాలు ప్రతిష్టించిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు రాచప్ప తెలిపారు. ఈ ఉత్సవంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.