సీఎం కుర్చీ వదిలేసి మరో కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించిన అతిషి
Atishi: కేజ్రీవాల్ సీటును అలానే ఉంచి.. సీఎం బాధ్యతలు చేపట్టిన అతిషి
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈరోజు బాధ్యతలు చేపట్టానని, 14 ఏళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగించినప్పుడు భరతుడి మనోగతం ఎలాగ ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్తోనే ఉన్నట్టు అతిషి చెప్పారు.
Atishi: కేజ్రీవాల్ సీటును అలానే ఉంచి.. సీఎం బాధ్యతలు చేపట్టిన అతిషి
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా 'ఆప్' (AAP) నేత అతిషి (Atishi) సోమవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కూర్చునే సీటును ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే వేరే కుర్చీలో కూర్చుని విధులు నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈరోజు బాధ్యతలు చేపట్టానని, 14 ఏళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగించినప్పుడు భరతుడి మనోగతం ఎలాగ ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్తోనే ఉన్నట్టు చెప్పారు. రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి భరతుడు ఎలా పాలన చేశారో అదే విధంగా రాబోయే నాలుగు నెలలు తాను ఢిల్లీ ప్రభుత్వ పాలన సాగిస్తానని తెలిపారు.
''కేజ్రీవాల్ తన రాజీనామాతో రాజకీయాల్లో హుందాగా ఎలా వ్యవహరించాలనే దానికి ఉదాహరణగా నిలిచారు. ఆయన ఇమేజ్ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి ఆరు నెలల పాటు జైలులో ఉంచింది. ఫిబ్రవరి ఎన్నికల్లో తిరిగి కేజ్రీవాల్ను ప్రజలు గెలిపించుకుంటారని నమ్ముతున్నాను. అప్పటివరకూ ఆయన సీటు ఖాళీగానే ఉంటుంది'' అని అతిషి చెప్పారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్య, రెవెన్యూ, ఆర్థికం, విద్యుత్, ప్రజాపనుల శాఖతో శాఖ 13 మంత్రిత్వ శాఖలను అతిషి నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఆమె తన వద్దే ఆ శాఖలు ఉంచుకున్నారు. మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేతిలో ఏడు శాఖలు ఉన్నాయి. వీటిలో ఆరోగ్యం, పర్యాటకం, ఆర్ట్ అండ్ కల్చర్ శాఖలు కూడా ఉన్నాయి. గత మంగళవారం కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో శనివారంనాడు ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు.
