హైదరాబాద్: సోషల్ మీడియాలో(Social Media) కొందరి విపరీత ధోరణి సమాజంలో ఇతరులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..! ఇందుకు యూట్యూబర్ హర్ష (మహాదేవ్) అనే యువకుడి ఘటనే ఉదాహరణ. ఫేమస్ కావడం కోసం డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతూ.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీడియో వైరల్ కావడం అటుంచితే.. హర్షనే వైరల్ అయిపోయాడు. హర్షను అదుపులోనికి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోలీసులు సూచించారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖాకీలు హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. యూట్యూబర్ మహాదేవ్పై BNS 292,125తోపాటు పలు సెక్షన్ల కింద కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.