కోడ్‌ ముగియగానే.. విద్యుత్‌శాఖలో బదిలీలు!

 ఏఈ నుంచి సీజీఎంల వరకు భారీ మార్పులు

- ఐదేళ్లుగా ఒకే సర్కిల్‌లో చక్రం తిప్పుతున్న కొందరు అధికారులు



హైదరాబాద్‌ సిటీ: ఎన్నికల కోడ్‌ ముగియగానే తెలంగాణ దక్షిణప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(Telangana Southern Region Electricity Distribution Company)ల్లో అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్కంలో కొంతమంది అఽధికారులు నాలుగైదేళ్లుగా ఒకే సర్కిల్‌, డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తూ చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. ఈనేపథ్యంలో జూన్‌ రెండో వారంలో ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్‌ఈ, సీజీఎంతో పాటు అకౌంట్స్‌ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టేలా డిస్కం చర్యలు మొదలు పెట్టింది. అలాగే, పదోన్నతులకు సీనియార్టీ లిస్ట్‌, బదిలీలకు మూడేళ్లు పూర్తిచేస్తున్న అధికారుల జాబితాపై టీజీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం దృష్టి సారించింది. నాలుగునెలలుగా పలు డివిజన్లలో కొన్ని పోస్టులకు అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు.


మేడ్చల్‌ సర్కిల్‌(Medical Circle) పరిధిలోని ఓ డివిజన్‌లో గత నెలలో ఓ డీఈ పదవీ విరమణ చేయగా, ఆ స్థానంలో సీజీఎం ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేసే అధికారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శివారు సర్కిళ్లలో సీజీఎంలు, ఎస్‌ఈలు నచ్చిన వారికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో అన్ని విభాగాల్లోనూ ఇన్‌చార్జిలను బదిలీ చేసే అవకాశం ఉంది.


పదోన్నతులపై కదలిక


పదోన్నతులతో తమకు అన్యాయం జరిగిందని పలు సంఘాల నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. సీఎండీలను కలిసి అన్యాయానికి గురైన వారికి పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని వినతిపత్రాలు అందచేశారు. ఈనేపథ్యంలో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశం, బదిలీల ప్రక్రియ కోడ్‌ ముగియగానే ప్రారంభిస్తారంటూ ఇంజనీరింగ్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow