Telangana: ఆ ఎంపీ సీట్ పై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు..
ఇప్పుడు ఆ ఎంపీ సీట్ గెలవడం అన్ని ప్రధాన పార్టీలకు చాలా ముఖ్యం.. దీనికోసం మూడు పార్టీల సీనియర్లు ఆ ఎంపీ స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ పార్లమెంట్ పరిధిలో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో బిజీ బిజీ అయిపోయారు నేతలు. మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది.

1980లో అధికారం కోల్పోయి రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని.. మెదక్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. రాజకీయంగా ఆమెను నిలబెట్టి ప్రధాని పదవిని అధిరోహించేలా చేశారు. అందుకే ఆమె, మెదక్ ప్రజలపై ప్రత్యేక అభిమానాన్ని చూపారు. మొత్తం 16సార్లు మెదక్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. తాజగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఇదే ఊపులో మళ్ళీ మెదక్ పార్లమెంట్ స్థానంను దక్కించుకోని పూర్వ వైభవం దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక బీఆర్ఎస్ కూడా ఈ నియోజకవర్గన్ని సీరియస్గా తీసుకుంది. గతంలో ఉన్న సిద్దిపేట పార్లమెంట్ స్థానం, నియోజకవర్గాల పునర్విభజనలో రద్దవడంతో అందులో కొన్ని అసెంబ్లీ స్థానాలు మెదక్ పార్లమెంట్ స్థానంలో కలిశాయి. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, దుబ్బాక, గజ్వెల్, సిద్దిపేట సహా మొత్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పరిధిలో ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో గజ్వెల్, సిద్దిపేట నియోజకవర్గాలు వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్కు కంచుకోటగా మారాయి. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మెదక్ నియోజకవర్గాన్ని గులాబీ పార్టీ లాగేసుకుంది. మొత్తం నాలుగు సార్లు ఎంపీ ఎన్నికల్లో గెలిచింది బీఆర్ఎస్. అప్పటి నుండి మెదక్ బీఆర్ఎస్ కంచుకోట అయ్యింది.
కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ అదే కసితో పనిచేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని తానై ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఈ సీట్ గెలవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత అవసరం. ఇక బీజేపీ కూడా మెదక్ స్థానంను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడి నుండి రఘునందన్రావును రెండోసారి బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినా తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు.. అయినప్పటికీ నియోజకవర్గం పై పట్టు,గత పాలనా అనుభవం రఘునందన్కు కలిసి వస్తుందనే ఆ పార్టీ యోచించి మళ్ళీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో తనదైన వాక్చాతుర్యంతో దూసుకుపోతున్నారు రఘునందన్ రావుదేశంలో మోడీ హవా, రామమందిర నిర్మాణం, ఫిర్ ఏక్బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకెళ్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు రఘునందన్.. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయా పార్టీల సీనియర్ లీడర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పుడు లేని ఉత్కంఠ ఈ సారి మెదక్ పార్లమెంట్ పరిధిలో కన్పిస్తుంది. మెదక్ ప్రజలు ఎటు వైపు ఉంటారో.. ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి మరి.