హైదరాబాద్: ఎంపీ కేశవరావు (MP Kesava Rao)కు మతి భ్రమించినట్లుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మిలియన్ మార్చ్లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలి. ఇవాళ పాట లేదు మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారని.. ఆయన భాష ఎవరికి అర్ధం కాదన్నారు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో తెలియదని.. అలాంటి ఆమెకు కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చారన్నారు. పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారని రసమయి ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం కేకేకు సరికాదన్నారు.
కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలని రసమయి డిమాండ్ చేశారు. లేదంటే ఆయన ఇంటి ముందు ధూం ధాం నిర్వహిస్తామన్నారు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress) మొదట్నుంచి తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉందన్నారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టిలో సభ్యత్వం లేదన్నారు. కడియం శ్రీహరి ఏ బడిలో చదువుకున్నారో.. ఎక్కడ బడి చెప్పారో ఎవరికీ తెలియదన్నారు. కడియం శ్రీహరి మాదిగ ద్రోహి అని.. మాదిగ జాతి అంటేనే ఆయనకు కళ్ల మంట అని రసమయి పేర్కొన్నారు.
కడియం శ్రీహరి వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరీ రమేష్ వెళ్ళిపోయారని రసమయి అన్నారు. మాదిగలకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామన్నారు. వరంగల్లో కడియం శ్రీహరిపై చావు డప్పు కొడుతామని హెచ్చరించారు. ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయని రసమయి అన్నారు. మా పార్టీ ఆదేశిస్తే తాను వరంగల్ నుంచి పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారనే దానిపై మందకృష్ణ మాదిగ అన్న ఎందుకు మాట్లాడం లేదని రసమయి ప్రశ్నించారు
