నిరుడు యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... టెండర్ల విధివిధానాలను ఖరారుచేసింది.
బిడ్డర్ వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లు ఉండాల్సిందే
1,832 రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యానికి టెండర్లు
బిడ్డింగ్ దాఖలుకు వచ్చేనెల 7 తుది గడువు
టెండర్ల వివరాలు వెల్లడించిన పౌరసరఫరాల సంస్థ
నిరుడు యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... టెండర్ల విధివిధానాలను ఖరారుచేసింది. నిరుడు 67 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా అందులో ఇప్పటికే కొంత మిల్లింగ్ జరుగుతోంది. అయితే 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 28 జిల్లాల్లో 1,832 రైస్మిల్లుల్లో నిల్వచేసిన ఈ వడ్లను 12 లాట్లుగా విభజించి టెండర్లు పిలిచింది. ఒక్కో లాట్కు 3 లక్షల టన్నుల ధాన్యం కేటాయింపులుచేసి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించటం గమనార్హం. బిడ్డర్ వార్షిక టర్నోవర్ రూ. 200 కోట్లుగా నిర్ణయించారు. ధాన్యాన్ని విక్రయించేందుకు జనవరి 25న ఉత్తర్వులు జారీ చేయగా ఆ తారీఖు నుంచే బిడ్డింగ్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఈ-టెండర్ ప్లాట్ఫామ్పై టెండరు బిడ్డింగులు దాఖలుచేయటానికి ఫిబ్రవరి ఏడో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది గడువు ఇచ్చారు. ఈనెల 31న మధ్యాహ్నం 2 గంటలకు ఆసక్తి కలిగిన ట్రేడర్లతో ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని రాష్ట్ర పౌరసరఫరాల భవన్లో నిర్వహించాలని కమిషనర్ డీఎస్ చౌహాన్ నిర్ణయించారు. అనంతరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఉదయం 11 గంటలకు టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేస్తారు. తొమ్మిదో తేదీన ఉదయం 11 గంటలకు ఫైనాన్షియల్ బిడ్ను ఓపెన్ చేస్తారు. అదేక్రమంలో స్టాక్ వెరిఫికేషన్కు కూడా అవకాశం కల్పించారు. రైస్మిల్లుల్లో ధాన్యం నిల్వలు స్వయంగా పరిశీలించాలనుకునే బిడ్డర్లు... ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
28 జిల్లాల్లో ఉన్న 1,832 రైస్మిల్లుల్లో... ఏ మిల్లులో ఎంత ధాన్యం వేలం వేస్తున్నారో తెలిపే వివరాలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.585 చొప్పున ‘ఈఎండీ’(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) చెల్లించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. అంటే ఒక్కో లాట్(3 లక్షల టన్నుల)కు రూ. 17.55 కోట్ల ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన 11 లాట్లకు కలిపి రూ. 193 కోట్ల డిపాజిట్ వస్తుంది. 12వ లాట్ ఈఎండీ రూ. 9.30 కోట్లు కలిపితే మొత్తం రూ. 202 కోట్ల పైచిలుకు ఈఎండీ వస్తుంది. టెండర్లు దక్కించుకున్న బిడ్డర్ను మినహాయించి.... దక్కని బిడ్డర్లకు నెల వ్యవధిలో ఈఎండీని తిరిగి చెల్లిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న బిడ్డర్... ధాన్యం విలువపైన 5 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో వారం రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. టెండర్లు దాఖలుచేయటానికి బిడ్డర్ వార్షిక టర్నోవర్ రూ. 200 కోట్లు ఉండాలని షరతు విధించారు. కమోడిటీ ట్రేడింగ్లో గత మూడేళ్ల ఐటీ రిటర్నులు, జీఎస్టీ వివరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లే ధాన్యం రవాణా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. పే అండ్ లిఫ్ట్ పద్ధతిలో ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొత్తం లిఫ్టింగ్ ప్రక్రియను 90 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ధాన్యం టెండర్లకు విధివిధానాలు ఖరారుచేసిన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ... బేస్ ప్రైస్ను మాత్రం నిర్ణయించలేదు.
ఎక్కువ ధర పలకటమే కీలకం
యాసంగి ధాన్యాన్ని విక్రయించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసింది. కానీ బిడ్డర్లు తక్కువ ధర (క్వింటాకు రూ. 1,732) కోట్ చేయటంతో టెండర్లు రద్దుచేయాల్సి వచ్చింది. ఇప్పుడు వేలంపాట వేస్తున్న ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఎమ్మెస్పీ ప్రకారం.. క్వింటాకు రూ. 2,040 నుంచి రూ. 2,060 చొప్పున కొనుగోలు చేసింది. ఈ ఎమ్మెస్పీకి మార్కెట్ ఫీజు, రవాణా చార్జీలు, కొనుగోలు కేంద్రాల కమీషన్, వడ్డీ చార్జీలు, మిల్లింగ్ చార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కలిపితే క్వింటా ధాన్యం విలువ రూ. 2,270 అవుతుంది. ఇంతకంటే ఏమాత్రం తక్కువ ధర కోట్ చేసినా.... కార్పొరేషన్కు నష్టం వస్తుంది. 2023-24 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకానికి రూ. 2,183 ఉంది. గ్రేడ్- ఏ రకానికి రూ. 2,203 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కామన్ వెరైటీ ధాన్యం ధర క్వింటాకు రూ. 2,250 ఉంది. టెండర్లలో పాల్గొనే బిడ్డర్లు ఈ ధర కోట్ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డర్లు రింగ్ కాకుండా చర్యలు తీసుకుంటే... పోటీపెరిగి ఎక్కువ ధర కోట్ చేసే అవకాశాలున్నాయి. అలా చేస్తే కార్పొరేషన్కు ఆదాయం పెరిగే అవకాశాలుంటాయి.