ఫోన్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే ఎన్నో ప్రమాదాలు - ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోయిన ఫోన్లు 15,337 -పోలీసులు రికవరీ చేసినవి 4,412 - ఫోన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ? మన జీవనంలో మొబైల్ ఫోన్ విడదీయరాని భాగమైపోయింది. ఫోన్ లేకపోతే రోజు గడవదన్న స్థాయికి చేరుకున్నాం. వ్యక్తిగతమైన సమాచారం ఉండే ఫోన్ పోయి అసాంఘిక శక్తులు, సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో పడితే ఇబ్బందులే కాకుండా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కేసులు విచారణలు సైతం కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో రికవరీ చేస్తూ బాధితులకు అందించటంతో వారికి ఎంతో ఊరటగా మారింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రికవరీలో జడ్చర్ల పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే 6వ స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఫోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు ఆసక్తికర విషయాలతో ఈటీవీ భారత్ ప్రత్యేత కథనం.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా నిత్యం ఎంతోమంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. మరికొందరి ఫోన్లు మార్కెట్లో చోరీకి గురవుతున్నాయి. వారు పోగొట్టుకుంటున్న ఫోన్లు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల విలువే కాదు, ఎంతో కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని సైతం కోల్పోతున్నారు. బంధువులు, అత్మీయులు, తెలిసిన వారి ఫోన్ నంబర్లు, కుటుంబానికి చెందిన ఫొటోలు, బ్యాంకు లావాదేవీలు చేసే యాప్స్, కీలకమైన పత్రాలు ఇలా ఎన్నో ముఖ్యమైన వివరాలు అందులోని భద్రపరుస్తున్నాం. అందుకే ఫోన్ పోయిన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.
