Rachakonda CP: రేపటి నుంచి అమల్లోకి కొత్తచట్టాలు..
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి(Rachakonda CP Tarunjoshi) పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు.
నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించిన రాచకొండ సీపీ
హైదరాబాద్ సిటీ: జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి(Rachakonda CP Tarunjoshi) పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. నూతన చట్టాలపై శనివారం ఘట్ కేసర్లోని విజ్ఞాన భారతి కళాశాలలో పోలీస్ అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ తరుణ్జోషి, న్యాయ నిపుణులు, హైకోర్టు అడ్వకేట్ సురేష్ పాల్గొని నూతన చట్టాల నిర్వహణతోపాటు.. విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భారత్ స్వతంత్రదేశంగా మారిన తర్వాత కూడా వలస పాలన నాటి న్యాయచట్టాల ప్రకారమే నేరన్యాయ వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ నిర్వహించడం జరుగుతోందని సీపీ గుర్తు చేశారు. ఇన్నేళ్లలో భారత న్యాయ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం మనదేశ శాంతిభద్రతల పరిరక్షణలో ఒక మైలురాయి అని తెలిపారు.