వెల్దండ : ప్రస్తుతం రోజు రోజుకు అవినీతి దేశ వ్యాప్తంగా ఎక్కువవుతుంది. లంచం తీసుకోవద్దని ప్రభుత్వ అధికారులకు ఉన్నతాధికారులు ఎంత చెప్పినప్పటికీ నిత్యం ఎక్కడో ఒకచోట లంచానికి ఆశపడుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మండల పరిధిలోని విద్యుత్ శాఖలో ఇన్ చార్జి ఏఈగా విధులు నిర్వహించే వెంకటేశ్వర్లు ట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. 5నెలల క్రితం విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ గా విధుల్లో చేరిన వెంకటేశ్వర్లు మండల పరిధిలోని చొక్కనపల్లి గ్రామ శివారులోని ఫిర్యాదు దారుడు ఇంట్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సంబంధించిన పని చేయించిన అనంతరం మీటర్ ని బిగించేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో రూ.15వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆ ఫిర్యాదు దారుడు ఈనెల 05న మహబూ్సీబ్ నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ సారధ్యంలో అధికారులు డబ్బులు ఇచ్చి పంపారు. ఆ ఫిర్యాదు దారుడు ఇంట్లో ఏఈ కి రూ . 15వేల రూపాయలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ నుంచి రూ.15వేలు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారు. అలాగే జడ్చర్ల లోని ఏఈ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇంచార్జ్ ఏఈ ని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ వెల్లడించారు. ఈ దాడులలో నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఈ ని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారి ద్వారా డీఎస్పీ వాంగ్మూలం తీసుకున్నారు.
Tags
Mahabunagar