వనపర్తి : బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సు కి న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి.రజిని హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం.. మైనర్ల వివాహాలకు సహకరించిన,ప్రయత్నించిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హులు అవుతారని హెచ్చరించారు. పోక్సోచట్టంను వివరిస్తూ మైనర్ బాల బాలికలపై లైంగిక వేధింపులు చేసిన వ్యక్తులు పోక్సో చట్ట ప్రకారం శిక్షఅర్హులు అవుతారన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్దంగా చదివి, వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు.విద్యార్థులు వినోదం, సందేశాత్మకమైన, నీతి కథలు పుస్తకాలను చదవడం ద్వారా సమయ స్ఫూర్తి పెంపొందించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చునని, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ రఘు, పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags
Mahabunagar