తెలుగు తంబి అన్నామలై.. అదేంటి?
అంటే తమిళ తంబి అనాలి.. లేదంటే తెలుగు తమ్ముడు అనాలి. తెలుగు తంబీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది..ఈ సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది ఎన్డీయే కూటమి. బీజేపీ ఏమో తమిళనాడు నేత, మాజీ పోలీస్ అధికారి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే అన్నామలై తెలుగు తంబీ అయిపోతున్నారు.
ఇటీవల వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు కూటమి వశమైంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూటమిలోని ఏ పార్టీకి కేటాయించాలన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ స్థానంపై సుదీర్ఘంగా చర్చించారు.
40 నిమిషాల పాటు సాగిన చర్చల అనంతరం రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ, జనసేన అంగీకరించాయి. రాజ్యసభ సీటు బీజేపీకి దక్కడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై మంతనాలు జరుపుతోంది బీజేపీ అధిష్టానం. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని బీజేపీ యోచిస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు ఉండటంతో అన్నామలై వైపే అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా నివాసంలో చంద్రబాబును కలిశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తమిళనాడు బీజేపీ అధ్యక్ష ఎంపికకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు కిషన్రెడ్డి. దీంతో అన్నామలైకి ఏపీ నుంచి రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా రాజ్యసభ స్థానం కూటమికి దక్కుతుంది. అయితే కూటమిలో ఏ పార్టీకి దక్కబోతుందన్న సస్పెన్స్కు తెరపడింది. పొత్తులో భాగంగా కుదిరిన ఒప్పందాలు, మిత్ర ధర్మంలో భాగంగా బీజేపీకి రాజ్యసభ ఇచ్చేందుకు టీడీపీ, జనసేన అంగీకరించాయి. ఏపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగో రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఇది.
గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు స్థానాల్లో ఒక స్థానాన్ని టీడీపీ నుంచి సానా సతీష్కు ఇవ్వగా మరో స్థానంలో బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరో స్థానంలో వైసీపీ నుంచి ఎన్నికైన ఆర్. కృష్ణయ్య రాజీనామా చేసి బీజేపీ నుంచి రాజ్యసభకు వచ్చారు. ఇప్పుడు తాజాగా జనవరి 25న విజయసాయి రెడ్డి రాజీనామాతో ఆస్థానంలో బీజేపీ నుంచి మరో నేత రాజ్యసభకు వెళ్లబోతున్నారు.
రాజ్యసభ రేసులో ఎవరున్నారు..?
ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్ధుల రేసులో తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్నామలైకి రాజ్యసభ ఇచ్చి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించి తమిళనాడులో పాగా వేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. దీనికి ఊతం ఇచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అమిత్ షా భేటీకి ముందు తమిళనాడు పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్దిరోజుల క్రితం బీజేపీ తమిళనాడు రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎంపికకు కిషన్ రెడ్డిని ఇంచార్జ్గా బాధ్యతలు నిర్వహించారు. అన్నామలై పేరు రాజ్యసభ నుంచి గట్టిగా వినిపిస్తుండడంతో ఈ విషయంపైనే కిషన్ రెడ్డితో అమిత్ షా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రాజ్యసభలో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు, సోనియాగాంధీకి రాజ్యసభలో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు స్మృతి ఇరానీని రాజ్యసభకు పంపుతారన్న చర్చ జరుగుతుంది.
వారం రోజుల్లో అభ్యర్థిపై క్లారిటీ..!
ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 15న షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 25న రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయగా ఈ నోటిఫికేషన్ అనివార్యమైంది. వాస్తవానికి విజయసాయిరెడ్డికి 2028 జూన్ 21 రాజ్యసభ పదవీకాలం ఉంది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థాన ఎన్నికకు నేడు ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29 గా నిర్ణయించారు. అంటే మరో వారం రోజుల్లోగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాబోతుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు గడువు ఇవ్వడం జరిగింది. మే 9న ఎన్నిక నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4 ఓటింగ్.. అదేరోజు సాయంత్రం 5 గంటలకి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఏకగ్రీవంగా అభ్యర్థి ఎన్నిక ఉండబోతుంది.