కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి : పల్లెల్లో ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొలి విడుత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 11న తొలి విడుత ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామపంచాయతీ బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. అయితే ఇక్కడ సర్పంచ్ పదవీ కోసం సొంత అన్నదమ్ములు బరిలో ఉన్నారు. కొమ్మ గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉండగా.. కాంగ్రెస్ మద్దతుతో కొమ్మ రాజు ఒకే కుటుంబం నుంచి సర్పంచ్ పదవీ కోసం తలపడుతున్నారు.ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎన్నికల పోటీని చూసి కన్న తండ్రి కలత చెందుతున్నట్టు సమాచారం. నామినేషన్ల ఘట్టం ముగింపు చివరి రోజు మంగళవారం కావడంతో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు వస్తున్నాయి. ఇక పెద్ద కొత్తపల్లి మండలంలో దేవుని తీర్మాలాపూర్ గ్రామ పంచాయతీ (జనరల్ మహిళ) సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుతో ఒకే ఇంటి నుంచి (మాజీ సర్పంచ్ సత్యం భార్య) వనోజు లక్ష్మి (అత్త), తేజశ్వని (కోడలు) నామినేషన్లు దాఖాలు చేశారు. అలాగే కాంగ్రెస్ మద్దతుతో పెద్ద కొత్త పల్లి మండలం వెన్నచర్ల గ్రామ పంచాయతీ(బీసీ జనరల్) సర్పంచ్ పదవికి ఒకే ఇంటి నుంచి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు (మాజీ ఎంపీపీ) సూర్య ప్రతాప్ గౌడ్ (కొడుకు), సూర్య నారాయణమ్మ ( తల్లి )తమ నామినేషన్లు వేశారు. తాము వేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులుగా ఉంటే స్క్రూట్నిలో నామినేషన్లు రద్దు కాకుండా కొందరూ ముందుస్తుగా తమ రక్త బందికులతో నామినేషన్లు వేయించుకున్నారని చర్చ జరుగుతుంది. ఈ నెల 6న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిస్తే.. తీరా ఎన్నికల బరిలో ఎవ్వరు ఉంటారో తేలనుంది.
Tags
mahabubnagar