మొదలైన హోం ఓటింగ్‌.. మొదటి రోజు నగరంలో ఇంటి వద్దే ఓటేసిన 177 మంది

 



హోం ఓటింగ్‌(Home voting) మొదలైంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు.. ఫారం-12డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 506 మందికి హోం ఓటింగ్‌ అవకాశం దక్కింది. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 121 మంది అర్హులు ఉండగా మొదటి రోజు 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో 385 మందికిగాను 65 మంది ఓటు వేశారు. నేడు, రేపు హోం ఓటింగ్‌ కొనసాగుతుందని, ఇప్పటికే సిద్ధం చేసిన రూట్‌ మ్యాప్‌ ఆధారంగా 85 ఏళ్లు పైబడినవారితో ఓటు వేయిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌, కేంద్రీయ విద్యాలయలో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రతా విధుల్లో పాల్గొనే పోలీసులు అంబర్‌పేటలోని సీపీఎల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేశారు.


మొదటి రోజు 852 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు..!


హైదరాబాద్‌ సిటీ: నగరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొదలైంది. పోలింగ్‌ విధుల్లో ఉండే 852 మంది ఉద్యోగులు మొదటి రోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి పికెట్‌లోని కేంద్ర విద్యాలయం ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 342 మంది, హైదరాబాద్‌ పార్లమెంట్‌కు సంబంధించి ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో 488 మంది, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కంటోన్మెంట్‌ సీఈఓ కార్యాలయంలో 22 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కొనసాగనుంది. 19500 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال